జులై 3 న చేయబోయే ప్రదర్శన కు పెరుగుతున్న ఎన్నారై ల మద్దతు
వన్ స్టేట్...వన్ క్యాపిటల్ నినాదంలో భాగంగా ఆంధప్రదేశ్కు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని తెలుగు ఎన్నారైలంతా అమరావతి రైతులకు మద్దతుగా జూలై 3వ తేదీన వెలుగుపూల సంఘీభావం (క్యాండిల్ లైట్ ప్రదర్శన) నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే కాదు...ప్రపంచ చరిత్రలో రాజధాని నిర్మాణానికి వివాద రహితంగా భూసేకరణ జరిగిన ఏకైక ప్రాజెక్టు అమరావతి. అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప నగరాన్ని నిర్మించుకుందాం అంటూ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. రాజధాని కట్టాక తొలి ప్రయోజనాలు మీకే ఇస్తాం అని ప్రభుత్వం అధికారికంగా భరోసా ఇవ్వడంతో వివాదరహితంగా వేల మంది రైతులు తమ భూములకు ఒక్కపైసా తీసుకోకుండా రాష్ట్రానికి ఇచ్చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే వారి త్యాగం నిష్ఫలంగా మారింది. అప్పటివరకు వేగంగా సాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది. తమతో పాటు అందరూ బాగుండాలని చేసిన రైతుల త్యాగం వృథా అయింది. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు నిరసనకు దిగారు. అలుపెరగకుండా పోరాడుతున్నారు. వారి పోరాటం 200 రోజులకు చేరుకుంది.
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ప్రపంచంలోని ఎన్నారైలను ఒక్కతాటిపైకి తెచ్చి వారికి మద్దతుగా వెలుగుపూల ప్రదర్శనకు అమెరికాలోని తెలుగు ప్రముఖులు జయరాం కోమటి ఇచ్చిన పిలుపునకు అన్నీచ్లో నుంచి మంచి స్పందన వచ్చింది. అమెరికా నుంచే కాకుండా ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాల నుంచి కూడా పలు నగరాల్లో స్థిరపడిన ఎన్నారైలు అమరావతి నిరసనకు మేము కూడా జైకొడతాం అని ముందుకువస్తున్నారు. 200 రోజులు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని 200 నగరాల నుంచి జూమ్ కాల్ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్ లైట్ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుదాం అని ఇచ్చిన పిలుపు 300 నగరాలకు చేరింది.అమరావతియే ఏపీ రాజధానిగా రాష్ట్ర ప్రజలతోపాటు ప్రపంచంలోని ఎన్నారైలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. ఈ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారంతా కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికాయేతర నగరాలను సతీష్ వేమన కోఆర్డినేట్ చేస్తుండగా... నాట్స్ తరఫున ఎన్నారై నేతలు డాక్టర్ మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, ఆప్టా తరఫున బాబు పత్తిపాటి, విజయ్ గుడిసేవ కీలకంగా పాలుపంచుకుంటున్నారు. రత్నప్రసాద్, ఠాగూర్, సాయి, చందు సోషల్ మీడియాలో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు అమెరికా, ఇతర దేశాలలో దాదాపు 100 మంది ఆయా నగరాల కో ఆర్డినేటర్లుగా ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా తమ మద్దతు తెలుపుతూ తమ పేర్లను నామినేట్ చేస్తున్నారు. కార్యక్రమ విజయవంతానికి అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈస్థాయిలో ఎన్నారైలందరూ ఏకమై నినదించడం గతంలో ఎన్నడూ జరగలేదు ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అన్న నినాదంతో అందరూ ఒకేతాటిపైకి వస్తున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూన్ఱే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు స్థానిక నిబంధనలు అనుసరిస్తూ ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే వారంతా కచ్చితంగా నల్లటి మాస్క్ ధరించాలని, కోవిడ్ వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వారు కూడా నల్లటి మాస్క్ తో తమ ఇంట్లో నిరసన తెలిపి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని నిర్వాహకులు కోరారు.