ఉన్నతమైన సమాజానికి, భాషాసంస్కృతులే చక్కని పునాదులు వేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన మన భాష- మన సమాజం- మన తెలుగు సంస్కృతి అంతర్జాల సదస్సును ఆయన ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాషా సంస్క•తి, సమాజం పరంగా మనం ఎక్కడున్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవడం ముదావహం అని వెంకయ్య వ్యాఖ్యానించారు.
ప్రజలకు అర్థంకాని భాషల్లో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని గిడుగు భావించారని గుర్తు చేశారు. అందుకే పుస్తకాల్లో సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహానీయుడికి అందించే ఘనమైన నివాళి అని అన్నారు. మన సంస్కృతి చిరునామాలను భవిష్యత్కు అందించడం భాష ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచీకరణ వల్ల భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భాషలమీద ఆయా ప్రాంతాల్లోని వర్సిటీలు అధ్యయనాలు జరపాలని సూచించారు. పురోభివృద్ధిని కోరుకునేవారు మాతృభాషను మరవకూడదని పిలుపునిచ్చారు.