Monday, September 7, 2020

కంగ‌నాకి వై కేట‌గిరీ భ‌ధ్ర‌త‌..

 Kangana Ranaut granted Y plus category security ahead of her return to Mumbai on 9 September


బ‌హుశా భార‌త దేశ చ‌రిత్ర‌లోనే సినిమాల‌కు ప‌రిమిత‌మైన ఏ న‌టికీ ఈ ర‌క‌మైన భ‌ధ్ర‌త కేంద్ర‌ ప్ర‌భుత్వం క‌ల్పించిన దాఖ‌లాల్లేవు. ఆ ఘ‌న‌త‌ను సాధించింది బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. గ‌త కొన్ని రోజులుగా ర‌కర‌కాలుగా వార్త‌ల్లో ఉంటోంది ఈ బాలీవుడ్ క్వీన్‌. తొలుత నెపొటిజం, బాలీవుడ్ తో డ్ర‌గ్స్ లింకులు వగైరా అంశాల్లో మీడియాకు సంచ‌ల‌నంగా మారేలా వాగ్భాణాలు సంధించిన కంగ‌న‌... తాజాగా ముంబ‌యి మీద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ముంబ‌యి న‌గ‌రం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పిఒకె) లా త‌యారైంద‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. అప్ప‌టిదాకా కంగ‌న మీద క‌త్తులు నూరుతున్న బాలీవుడ్ పెద్ద‌ల‌కు శివ‌సేన వంటి మ‌త‌త‌త్వ పార్టీలు తోడ‌య్యాయి. ఆమెని ముంబ‌యి నుంచి త‌రిమి కొట్టాలంటూ ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు విమ‌ర్శ‌ల ప‌ర్వం మొద‌లుపెట్టారు. అదే క్ర‌మంలో కంగ‌న త‌న మాట‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని లేని ప‌క్షంలో ఆమెని ముంబ‌యిలో అడుగుపెట్ట‌బోనివ్వ‌మ‌ని శివ‌సేన ఎంపి సంజ‌య్ రౌత్ తీవ్రంగా హెచ్చ‌రించారు.

అయితే ఈ హెచ్చ‌రిక‌కు కంగ‌న అంత‌కంటే ఘాటుగా స్పందించింది. తాను ముంబ‌యిలో అడుగుపెడుతున్నాన‌ని ఎయిర్‌పోర్ట్‌లో ఫ‌లానా స‌మ‌యానికి దిగుతాన‌ని ద‌మ్ముంటే అడ్డుకోవాలంటూ స‌వాల్ విసిరింది. దీంతో మొత్తం వ్య‌వ‌హారం కేంద్ర ప్ర‌భుత్వం దాకా వెళ్లింది. కంగ‌న‌కు అవ‌స‌ర‌మైన భ‌ధ్ర‌త క‌ల్పించాల‌ని హిమాచల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్రం ఆమెకు వై కేటగిరీ భ‌ధ్ర‌త ఏర్పాటు చేస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

No comments:

Post a Comment