కరోనా చిత్ర పరిశ్రమను ఎంత నష్టాల్లోకి నెట్టేసిందో అందరికీ తెలిసిందే. ఒకదానికి ఒకటి లింక్ ఉన్న పనులు కావడం వల్ల చాలా మంది దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సినిమాలు రిలీజ్ అవ్వాలంటే థియేటర్లు ఉండాలి. సినిమాలు పూర్తి కావాలంటే షూటింగ్ చెయ్యాలి. షూటింగ్ చెయ్యాలంటే ఎవ్వరూ ధైర్యం చెయ్యలేని పరిస్థితి. చిన్న హీరోలు కూడా షూటింగ్ అంటే భయపడుతున్నారు. ఇక పెద్ద హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు హీరోలు జనవరి తర్వాతే షూటింగ్ అని గట్టిగా చెబుతున్నారు. ధైర్యం చేసి షూటింగ్ పెట్టాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పైగా చిత్ర యూనిట్లోని ప్రతి ఒక్కరి బాధ్యతా నిర్మాతే తీసుకోవాల్సి వస్తోంది. దీంతో నిర్మాతకు మరింత భారం పడుతోంది. ఇప్పుడిప్పుడే ఇతర భాషా హీరోలు షూటింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పడు టాలీవుడ్ హీరోలు కూడా షూటింగులకు బయల్దేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఒక నిర్ణయం తీసుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ కసరత్తులు చేస్తోంది.
టాలీవుడ్ నుంచి మొదటగా రామ్చరణ్ షూటింగ్కి రెడీ అవుతున్నాడు. అయితే అది రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్కి కాదు. నాన్న చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రం కోసం. ఈ సినిమాలో రామ్చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉండడంతో చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అంటే ఐదు నెలలుగా స్తంభించిపోయిన షూటింగును స్టార్ట్ చేసి ముందుకు వెళుతున్న హీరోల్లో మొదటి పేరు రామ్చరణ్దే. ఈ విషయంలో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు మెగాస్టార్ షూటింగ్ స్టార్ట్ అవుతోంది. మరో వైపు తమ అభిమాన యంగ్ హీరో రామ్చరణ్ షూటింగ్ను స్టార్ట్ చెయ్యడంలో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాడని అభిమానులు సంతోషిస్తున్నారు.
No comments:
Post a Comment