Saturday, September 5, 2020

పేద విద్యార్థులకు అండగా ఉయ్యాలా జంపాల హీరోయిన్ అవికా గోర్

 Avika gor Fundraising for Poor Students

ఈనాటి జనరేషన్ లో చదువుకు వున్నా ఇంపార్టెన్స్ మరో విషయానికి లేదని చెప్పాలి విద్య విషయంలో రాజీ పడకుండా అప్పు చేసైనా సరే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే అందరికీ విద్య అనేది నేటికీ చాలా మంది పేద వారికి  అందని ద్రాక్షే అవుతోంది. చదువు పైన ఆసక్తి వున్నా  పేదరికం చాలా కుటుంబాల్లో చిన్నారులను విద్యకు దూరం చేస్తోంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రస్తుత సంక్షోభంలో విద్యా బోధన మరింత సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్ విద్య ద్వారా ఆ లోటును భర్తీ చేయడానికి ‘క్యాంప్ డైరీస్’ లాంటి కొన్ని సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. యంగ్ హీరోయిన్ అవికా గోర్.. అలాంటి సంస్థలకు మద్దతు ఇస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు సాయం అందించింది. మిలింద్ చాంద్వాని 2017 నుంచి ‘టీచ్ ఫర్ ఇండియా’తో పని చేస్తున్నారు. పేద, వెనుకబడ్డ వర్గాలకు చెందిన పిల్లలకు విద్యను సరదాగా, సులభంగా నేర్పడానికి మరో అడుగు ముందుకేసి ‘క్యాంప్ డైరీస్’ అనే సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా శని, ఆది వారాల్లో క్యాంపులు పెట్టి పేద విద్యార్థుల విద్యకు అదనంగా అవసరమైన కార్యకలాపాలను, ఆటపాటలను నిర్వహిస్తున్నారు. క్యాంపులో మంచి ప్రతిభ చూపిన పిల్లలకు గురువులు గా  నిలుస్తూ వారికి అన్ని విధాలా మద్దతను అందిస్తున్నారు.

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన నటి అవికా గోర్.. సినిమాల్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. నటనతో పాటు తన గొప్ప మనసును కూడా చాటుకుంటోంది. క్యాంప్ డైరీస్ సంస్థకు అన్ని విధాలా తన మద్దతు అందిస్తోంది. అవికా గోర్ తన పుట్టిన రోజు (జూన్ 30)ను కూడా క్యాంప్ డైరీస్ కోసమే కేటాయించింది. తన అభిమానులు, శ్రేయోభిలాషుల తన బర్త్ డే సందర్భంగా కానుకలు పంపించడానికి బదులు క్యాప్ డైరీస్ సంస్థ కోసం నిధులు సేకరించాలని కోరింది. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’లో ఫండ్ రైసింగ్ ప్రారంభించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. అవికా గోర్ ఈ ఫండ్ రైసర్ ద్వారా వచ్చిన విరాళాలకు సమానంగా తన సంపాదన లోంచి నిధులను కేటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా క్యాంప్ డైరీస్ ప్రతినిధులు మరిన్ని కార్యక్రమాలను తీర్చిదిద్దుతున్నారు. అవిక పుట్టిన రోజు మిలాప్ ఫండ్ రైసర్ ద్వారా సేకరించిన నిధులతో సిబ్బందికి, వివిధ కార్యక్రమాలకు అవసరమైన సామన్లు సమకూర్చుకున్నారు. వీటిలో ప్రొజెక్టర్లు, గిటార్లతో పాటు కళలు, ఆటలకు సంబంధించిన సామన్లు ఉన్నాయి. క్యాంప్ డైరీస్ సంస్థ ఇప్పటివరకు 9 నగరాల్లో 5000 మందికి పైగా విద్యార్థులను చేరుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3000 మంది పిల్లలను చేర్చుకోవాలని  భావిస్తోంది. ఒక దేశంలో విద్యకు, అభివృద్ధికి ఉన్న అవకాశాలే ఆ దేశం పురోగతికి పునాదులుగా చెప్పవచ్చు. సామాజిక అసమానతలు దేశంలో ఆర్థిక, సాంఘిక విభజనను మరింత పెంచుతాయి. మన దేశం నలుమూలలా వందల సంఖ్యలో పాఠశాలల్లో ఇప్పటికీ డిజిటల్ విద్య సాధ్యం కావడంలేదు. దీని వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు. అలాంటి విద్యార్థులకు మద్దతు అందించడానికి ఎన్నో రెట్ల సాయం కావాల్సి ఉంది.

No comments:

Post a Comment