ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నవంబర్ క్రేన్ వద్ద మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు. మహాగణపతి నిమ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనం కంటే ముందు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకను చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. జై జై గణేశా నినాదాలతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు మార్మోగిపోయాయి.
మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర.. భక్తుల సందడి మధ్య ఐదారు గంటల పాటు శోభాయమానంగా సాగింది. కరోనా వైరస్ సంక్రమణ క్రమంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్న చిన్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
No comments:
Post a Comment